దార్శనిక చక్రవర్తి వ్యాసతాతయ్య తన " జయ" గ్రంధమున శ్రీకృష్ణార్జున సంవాదమును రచించి జాతి, కుల, మత ప్రమేయములేని ఒక అనుష్ఠాన ధర్మమును మానవజాతి కొసగినాడు. జయ గ్రంధము మహాభారత పురాణముగ రూపొందునాటికి ఈ భాగము అనేక చేర్పులకు, కూర్పులకు లోనై నేటి భగవద్గీతగా స్థిరపడినది. దీనినుండి రచయిత వ్యాస విరచిత మూలగీతా శ్లోకములను అంతర్దృష్టితో చూచి విచక్షణ అను గీటురాయిపై పరీక్షించి పునః ప్రతిష్ఠించినాడు. ఈ వ్యాసము కొత్త సాలో నింపిన పాతసారాయము. నేటి వైజ్ఞానిక యుగమున స్ఫూర్తిదాయకము. లోక కళ్యాణార్థము విశ్వవిజ్ఞాన క్షేత్రమున నాటుచున్నాము.
ఇది వేదాంత గ్రంధముకాదు. కర్మ అనివార్యము అనిన గ్రంధము. ఒక్క భౌతికవాదులనేగాక వైరాగ్యలాలసులనుకూడ సరిదిద్ది, సమత్వభావమున వారి బుద్ధిని నిశ్చలముచేసి, వారికి కర్తవ్యపరాయణము విధి అని చూపిన ఏకైక గ్రంధము. గీతల స్వరూపనిర్ణయము, శ్రీ కృష్ణాపదేశము, వ్యాసభగవానుల రచనా సౌందర్యములను వివరించుచు పాఠకులకు ఆసాంతము విసుగుకలిగించని వినూత్న ప్రక్రియ.
నేటికి సుమారు మూడు వేల సం||లకు పూర్వము రచితములైన మూల గీతలు మీ హస్తకమలములందున్నవి. వీటిని ఒక పర్యాయము పఠించినవారు గీతాకారుని పోకడ వ్యవహారికము కాదను నిందను తిరిగి మోపరు. మరియు భారతీయ మస్తిష్కము యొక్క ప్రాముఖ్యముకూడ స్పష్టమగును.